పంపకాల్లో విభేదాల వల్లనే దస్తగిరిని లేపేశారు
గుంటూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి మాజీ సీఎం , వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఏపీని అన్ని రంగాలలో నిర్వీర్యం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తలకు , నేతలకు దిశా నిర్దేశం చేశారు. కూటమి సర్కార్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలలోకి తీసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. ఇదే సమయంలో జగన్ రెడ్డిపై మండిపడ్డారు సీఎం. పంపకాల్లో విభేదాలు రావడంతో దస్తగిరి అనే కార్యకర్తను చంపేశారని సంచలన ఆరోపణలు చేశారు.
వాళ్ల మనుషుల్ని వాళ్లే చంపుకుని నేరం మనపై నెట్టేస్తారన్నారు. వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.నా జీవితంలో రాజకీయ పోరాటాలు చేశాను తప్ప… నేరగాళ్లతో ఏనాడూ పోరాడ లేదని అన్నారు. ఇది నాకు కొత్తగానే ఉందన్నారు. ఎన్నికలు అయ్యే దాకా తన బాబాయి వివేకానంద రెడ్డి హత్యను వాడుకున్నారని మండిపడ్డారు సీఎం. అధికారంలోకి వచ్చాక న్యాయం చేయండని సునీతారెడ్డి అడిగితే సైలెంట్గా ఉండమని ఆమెను బెదిరించారన్నారు. ఆస్తి విషయంలో తల్లి, చెల్లిపై ఎవరైనా కోర్టుకు వెళ్తారా.? అని ప్రశ్నించారు. సోషల్ సైకోలతో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని , ఇలాంటి పార్టీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు నాయుడు.






