కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి సర్కార్ గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే ఓ వైపు ఆర్తిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం సమీక్ష చేపట్టారు. కోనపాపపేట గ్రామంలో మత్స్యకారుల కోసం రూ.2 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాం అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా 100 శాతం సబ్సిడీపై ట్రాన్స్ పాండర్స్ ఇస్తోందని చెప్పారు. ఇవి తుపానులు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఎంతో ఉపయోగ పడతాయన్నారు. సముద్రంలో జీవవైవిధ్యాన్ని, చేపల సంఖ్యను పెంచడానికి జిల్లాలో 20 స్థలాలను ఎంపిక చేశారని తెలిపారు.
ఒక్కో చోట రూ. 20 లక్షల వ్యయంతో ఆర్టిఫిషియల్ రీప్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం . సముద్ర తాబేళ్లను రక్షించేందుకు వీలుగా అన్ని ట్రాలింగ్ బోట్లకు ఉచితంగా టెడ్ పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా… ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నాం అన్నారు. ముఖ్యంగా మత్స్యకారుల వలసలను తగ్గించి, తీరప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యం అని స్పష్టం చేశారు.





