స్పష్టం చేసిన ఎంపీ మాణికం ఠాగూర్
చెన్నై : తమిళనాడు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ టీవీకే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో 23 మంది కొత్తగా మంత్రివర్గంలో కొలువు తీరారు. గవర్నర్ లోక్ భవన్ లో గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ సందర్భంగా మాణికం ఠాగూర్ స్పందించారు. ఇది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు నడిపించే ఒక బలమైన ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో మేము 40కి 40 స్థానాలను కైవసం చేసుకోగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక తమిళనాడు రాష్ట్రంలో అత్యంత నమ్మకమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు మాణికం ఠాగూర్. ఇది ఇప్పటికే ఒక స్థిరమైన ప్రభుత్వం… ప్రజలచే తిరస్కరించబడిన వారు మాత్రం ప్రభుత్వానికి స్థిరత్వం లేదని పదే పదే ఆరోపిస్తూనే ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పరోక్షంగా నిన్నటి దాకా మిత్రపక్షంగా ఉన్న డీఎంకే పార్టీని, ఆ పార్టీ చీఫ్ ,మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. సంఖ్యాపరంగా ఈ ప్రభుత్వం బలంగా ఉంది, సభలో దీనికి తగినంత మద్దతు ఉందన్నారు. ఇది సంపూర్ణ మెజారిటీ కలిగిన ప్రభుత్వం, ఇది ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది అని పేర్కొన్నారు.






