వైద్యులను సన్మానించిన మంత్రి దామోదర
హైదరాబాద్ : నిమ్స్లో విజయవంతంగా 2 వేల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సత్కరించారు. ఈ మేరకు శనివారం నిమ్స్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిమ్స్లో విజయవంతంగా 2,000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు పూర్తి కావడం తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగానికి గర్వ కారణం అన్నారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన నిమ్స్ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నాయని చెప్పారు మంత్రి. ఒకప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే భారీ ఖర్చుతో కొద్దిమందికే అందుబాటులో ఉండేదన్నారు. ఈరోజు పేదలకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అవయవ మార్పిడి వైద్య సేవలు అందిస్తున్నాం అని చెప్పారు. అవయవ మార్పిడి ఆపరేషన్కే కాదు.. ఆపరేషన్ అనంతరం జీవితాంతం ఉచితంగా మెడిసిన్ కూడా అందిస్తున్నాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం డయాలిసిస్ నుంచి ట్రాన్స్ప్లాంట్ వరకు పూర్తి కిడ్నీ కేర్ ఎకోసిస్టమ్ నిర్మిస్తోందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 100కు పైగా డయాలిసిస్ కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు. మరో 79 కొత్త డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించారు దామోదర రాజ నరసింహ. నిమ్స్తో పాటు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కూడా అవయవ మార్పిడి సేవలను బలోపేతం చేస్తున్నాం అన్నారు. గాంధీ ఆస్పత్రిలో స్టేట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను ఇటీవలే ప్రారంభించుకున్నాం అని తెలిపారు.





