కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC), కోలిండియా (CIL) రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు మంత్రి కిషన్ రెడ్డి. గతేడాది అక్టోబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, భూమి కేటాయింపులు జరిపి ఈ నిధులను ఉపయోగించు కోవాలని కోరారు.
భారతదేశ ఇంధన పరివర్తన (Energy Transition), వికేంద్రీకృత ఇంధన వ్యవస్థలు (Decentralized Energy Systems), క్షేత్రస్థాయిలో వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడం వంటి అంశాలపై అర్థవంతమైన చర్చకు ‘Renergize 2026’ ఒక వేదికగా నిలిచింది. ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా Rengy సంస్థ తమ రాబోయే ‘పీర్-టు-పీర్ (P2P) ఎనర్జీ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్’ ను ప్రకటించింది. దీని ద్వారా గృహ వినియోగదారులు తమ వద్ద మిగిలి పోయిన అదనపు సోలార్ విద్యుత్తును ఒక నెట్వర్క్ ద్వారా ఇతరులకు అమ్ముకోవచ్చు. ఇది వినియోగదారులకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడమే కాకుండా, గ్రిడ్ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది . వికేంద్రీకృత ఇంధన వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.
దీంతో పాటు రూఫ్టాప్ సోలార్ వినియోగదారులకు విక్రయాల తర్వాతి సేవలు (after-sales service) ,లైఫ్సైకిల్ మేనేజ్మెంట్లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి Rengy సంస్థ తమ కస్టమర్ యాప్ (Customer App) , AMC (యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్) ప్లాట్ఫారమ్ ను ప్రారంభించింది. ఇది సోలార్ సిస్టమ్స్ పనితీరును, నమ్మకాన్ని పెంచి, దీర్ఘకాలిక వినియోగానికి దోహద పడుతుంది. భారతదేశంలో రూఫ్టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి , స్వయం సమృద్ధి గల ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సాంకేతికతతో కూడిన, పర్యావరణ అనుకూల పరిష్కారాల ఆవశ్యకతను ఈ సదస్సు పునరుద్ఘాటించింది.






