శ్రీవారి భక్తులకు దేవస్థానం తీపి కబురు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మే 21 నుండి ఈ వేలం ద్వారా విక్రయించడం ప్రారంభించామని తెలిపింది. అయితే ఈ వేలం పాట కార్యక్రమం వచ్చే నెల జూన్ 2వ తేదీ వరకు ఈ–వేలంపాట కొనసాగుతుందని స్పష్టం చేసింది టీటీడీ.
ఈ వేలంలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి కలిపి మొత్తం 505 లాట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. వీటిలో పాలిస్టర్, నైలాన్, కాటన్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్ పీస్లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్షీట్లు, దిండుకవర్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, పరదాలు, శిరోవస్త్రాలు, గొడుగులు, హుండీ గల్లేబులు, ఈర్వాడాలు తదితర వస్త్ర సామగ్రి ఉన్నాయని తెలిపింది.
ఆసక్తి గల భక్తులు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించాలని కోరింది.. అలాగే టీటీడీ అధికారిక వెబ్సైట్ www.konugolu.ap.govt.in / www.tirumala.org ద్వారా కొనుగోలు చేయాలని పేర్కొంది టీటీడీ.







