తన వ్యక్తిత్వానికి భంగం కలిగించొద్దు
న్యూఢిల్లీ : ఏం మాయ చేశావే, తండేల్ లాంటి విజయవంతమైన చిత్రాలలో హీరోగా ప్రూవ్ చేసుకున్న అక్కినేని నాగ చైతన్యకు ఊరట ఇచ్చేలా ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తను దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల దావాపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సూచించింది. తన పేరును ఉపయోగించే అశ్లీల వెబ్సైట్లు, అనధికారిక వస్తువులు, తనను, తన మాజీ భార్యను చూపిస్తూ ఏఐ (AI) రూపొందించిన కంటెంట్, తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు నాగ చైతన్య తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. తను ఆరోపించిన యూట్యూబ్ వీడియోలతో సహా పలు ఆన్లైన్ ఉల్లంఘనల నుండి రక్షణ ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా ఇటీవల కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ రంగాలకు చెందిన ప్రముఖులు క్యూ కట్టారు కోర్టుల చుట్టూ. తమ వ్యక్తిత్వాలను హరించే విధంగా ఏఐ తో జుగుస్సారకంగా, బూతులతో, అశ్లీల కంటెంట్ పోస్టు చేస్తున్నారంటూ వాపోయారు. తమను వాడుకుంటే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇటీవల కన్నడ నటి కూడా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కావని పేర్కొంది.








