నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత
అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో 2 ఎకరాల్లో, హైదరాబాద్ లో 30 ఎకరాల్లో, పులివెందులలో వందల ఎకరాల్లో ప్యాలస్ లు నిర్మించుకోవచ్చా అని ప్రశ్నించారు రాజధానికి మాత్రం కేవలం 400 ఎకరాలు ఉంటే సరిపోతాయని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. అమరావతి రాజధానికి మొదట అనుకూలమని చెప్పి అధికారంలోకి రాగానే గొడ్డలి వేటు వేసిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని ధ్వజమెత్తారు. నాడు అక్రమ కేసులతో అమరావతి రైతులను ఇబ్బంది పెట్టిన జగన్.. నేడు ముసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు.
జగన్ డైవర్ట్ పాలిటిక్స్ కోసం అమరావతి రైతులను వాడుకోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఏం మాట్లాడాలో తెలియ జగన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ పై మంత్రి సవిత మండిపడ్డారు. డీఎస్సీ నిర్వహించి ఏడాది అవుతోందని, డీఎస్సీని ఆపాలని గొడ్డలి పార్టీ ఎన్ని కేసులు వేసిన వాటిని జయించి యువతకు ఇచ్చిన మాట ప్రకారం 16 వేల టీచర్ ఉద్యోగాలు కల్పించామని మంత్రి సవిత తెలిపారు. ఏడాది తరవాత ఇప్పుడు అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసి అభ్యర్థులను తీవ్రంగా అవమానిస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో యువతకు భరోసా, మహిళలకు భద్రత కల్పిస్తున్నామన్నారు. డీఎస్సీ సృష్టికర్త చంద్రబాబు నాయుడేనని, 1995, 1996,1998, 2000, 2018, 2025లో అనేక డీఎస్సీలు విజయవంతంగా నిర్వహించి రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర ఆయనదేనని అన్నారు.





