నిప్పులు చెరిగిన నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు. నేను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేశాను. తమిళనాడుకు కర్నాటకతో సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారు… జాతీయ స్థాయి నేతలు వచ్చారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పార్టీ శాఖను పెట్టారు. విస్తరిస్తాం అన్నారు.
మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో తెలుగువాళ్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్లు పదవులు చేపడుతున్నారు. అక్కడ ఉండే రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారు. ప్రజలకు ఎవరు మంచిగా సేవలందిస్తారో… వాళ్లు ఆయా ప్రాంతాల్లో నాయకులు అవుతున్నారు. అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ప్రజలకు మంచి చేయటంలో పోటీ పడాలి తప్ప… ప్రజల మధ్య విబేధాలు తేవటం సరికాదు. రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి. అనసవరంగా వివాదాలు సృష్టించటం ఎవరికీ మంచిది కాదు అని ముఖ్యమంత్రి హితవు పలికారు.





