గురుకుల నిర్వహణపై మంత్రి కీలక సమీక్ష
అమరావతి : హాస్టళ్లు, గురుకులాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. బోధన, నిర్వహణ, మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. హాస్టళ్ల వార్డెన్లు, గురుకులాల ప్రిన్సిపాళ్ల బదిలీలు, పదోన్నతుల కల్పనలో ఈ గ్రేడింగ్ ను పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలని సూచించారు. వేసవి సెలవుల తరవాత హాస్టళ్లు విద్యార్థులు వస్తున్నారని, సహాజంగానే వారికి ఇంటిపై బెంగ ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు మనో ధైర్యం కలిగేలా వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. బెదిరింపులు, హెచ్చరికల ధోరణులతో కాకుండా స్నేహ పూర్వకంగా మెలగాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ఆరు ఎంజేపీ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. త్వరలో ప్రారంభం కాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించ నున్నట్లు వెల్లడించారు సవిత. ఆత్మకూరు, వనిపెంట, నరసన్నకోట, గొలగమూడి, కొత్తవలస, కలికిరి ఎంజేపీ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. బీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ కు శిక్షణిచ్చేలా రెండు ఎక్స్ లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1400 మంది విద్యార్థులతో ఈ రెండు సెంటర్లను ఈ విద్య సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు.






