అమరావతి : సవాళ్లను స్వీకరిస్తేనే సక్సెస్ సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు , క్వాంటం ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఇన్నొవేషన్స్ ప్రతిరోజూ కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. యువత భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేలా సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో తాము విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవానికి అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలను మరింత దగ్గర చేస్తున్నాం. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాం, పరిశ్రమలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్నాం అని చెప్పారు. యువత నేర్చుకోవడానికి, కొత్తవాటిని సృష్టించడానికి (build), నాయకత్వం వహించడానికి అవకాశాలను కల్పిస్తున్నామని అన్నారు.
మా లక్ష్యం చాలా స్పష్టమైనది. యువత కేవలం ఉద్యోగ అన్వేషకులుగా మాత్రమే మిగిలి పోవాలని మేము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు నారా లోకేష్. వారు ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ప్రజలు కేవలం మీ విజయాలను చూసి మాత్రమే గుర్తుంచు కోకూడదు. మీరు సమాజంలో తీసుకువచ్చిన మార్పు లేదా మీరు చేసిన కృషిని చూసి వారు మిమ్మల్ని గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి గొప్ప ముద్రను వదిలి వెళ్లడమే నిజమైన వారసత్వం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఉత్సాహభరితమైన కాలంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. యువత గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా కలలు కనేలా ఆంధ్రప్రదేశ్ నేడు ఒక వ్యవస్థను నిర్మిస్తోంది. మేము ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, భవిష్యత్తు నాయకుల కోసం అనేక అవకాశాలను కల్పిస్తున్నాం అని చెప్పారు నారా లోకేష్.





