స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : ఆక్రమణల నుంచి చెరువులను కాపాడామని, వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు ఏవీ రంగనాథ్. అన్నీ పరిశీలించిన తర్వాతనే తాము ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని చెప్పారు. కొందరు రాజకీయ నాయకులు, ఇతరులు కబ్జాలకు పాల్పడిన వాటిని గుర్తించామన్నారు. చాలా చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి కల్పించామన్నారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువు నిజంగానే ఒక చెరువు అని హైడ్రా అనేక చారిత్రక ఆధారాలతో నిరూపించిందని చెప్పారు. అలాగే, తమ్మిడికుంట వరద కాలువ ద్వారా నీరు చేరే మాదాపూర్లోని ఇడులకుంట కూడా వాస్తవానికి ఉనికిలో ఉందన్నారు. అందుకే వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టామని అన్నారు.
. NRSC ఉపగ్రహ చిత్రాలు, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులు , గ్రామ రికార్డుల ఆధారంగా.. అత్యంత శాస్త్రీయ పద్ధతులను అనుసరించి, అవి నిజంగానే చెరువులని HYDRA నిర్ధారించినట్లు చెప్పారు ఏవీ రంగనాథ్.. ఇదే వాస్తవం… దీనికి భిన్నంగా ఎవరైనా నిరూపించగలరా? అని HYDRA కమిషనర్ ప్రశ్నించారు. ఐటీ కారిడార్కు దగ్గరగా ఉన్న నార్సింగి సమీపంలోని ముష్కిన్ చెరువు వద్ద, ఆక్రమణదారులే స్వయంగా పేదలతో కలిసి గుడిసెలు వేయిస్తున్నారని విచారణలో తేలిందన్నారు. ఖాళీ చేయమని ముందుగా నోటీసులు ఇస్తే, మరిన్ని గుడిసెలు వెలుస్తాయని వారు భావించారు. అయినప్పటికీ, వారికి వాస్తవాలను వివరించి.. మీడియా సమక్షంలో ఆ స్థలాన్ని ఖాళీ చేయించామని తెలిపారు. అలాగే, ప్రతి చెరువు ఆక్రమణ వెనుక ఆర్థిక శక్తి, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు.. అటువంటి వ్యక్తులపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.






