ఘణంగా కొనసాగుతున్న పద్మావతి ఉత్సవాలు
తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పద్మ సరోవరంలో శ్రీ సుందర రాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. ఉదయం సుప్రభాతం, సహస్ర నామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం జరిపారు.
సాయంత్రం ఉత్సవ మూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేసి, తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుందరరాజ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో జేఈవో డా.ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ, సూపరింటెండెంట్ లు సురేష్, రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






