విజయవాడ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విజయవాడలో మెరుపు సోదాలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లా అనే ముగ్గురు యువకులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే కారణాలపై ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, జిహాదీ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయడం లాంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి . ఈ ముగ్గురి ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. విజయవాడ వన్ టౌన్ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో వేర్వేరు రాష్ట్రాల లింకులు బయట పడటంతో, దీని తీవ్రతను బట్టి ఇటీవలే ఈ కేసును అధికారికంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేశారు. కాగా నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాజా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.






