కర్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమల్లో సిమెంట్ రంగం అత్యంత సవాలుతో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ సంస్థగా మారాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్థ్యం, విద్యుత్ ఆధారిత రవాణాలో తన నాయకత్వాన్ని చాటుతూ.. ప్రపంచంలోనే RE100, EP100, EV100 కార్యక్రమాల్లో సభ్యత్వం పొందిన తొలి సిమెంట్ సంస్థగా కూడా దాల్మియా భారత్ నిలిచింది. కడప ప్లాంట్ విస్తరణ కూడా ఈ విషయాన్ని ప్రతిబింబిస్తోంది.
కార్యకలాపాల్లో 80 శాతం వరకు రెన్యూవబుల్ ఎనర్జీ, వేస్ట్ హీట్ రికవరీ, మున్సిపల్ వ్యర్థాల కో ప్రాసెసింగ్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, విస్తృత స్థాయిలో వర్షపు నీటి సంరక్షణ, విద్యుత్ వాహనాల ఆధారిత లాజిస్టిక్స్, ఏఐ ఆధారిత కార్యాచరణ సామర్థ్యం, అత్యుత్తమ ఉద్గార నియంత్రణ వ్యవస్థలు వంటి అంశాలతో ఈ ప్లాంట్ భవిష్యత్తుకు సిద్ధమైన తయారీకి ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి పరిశ్రమలతో భాగస్వామ్యం వహించడం ఆంధ్రప్రదేశ్కు ఎంతో గర్వకారణం.
జమ్మలమడుగు ఎప్పుడొచ్చినా జోష్ అదిరిపోతుంది. కడప జిల్లా ప్రజలు అనగానే నాకు గుర్తొచ్చేది కష్టం. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు కడప జిల్లా ప్రజలు. ఎవరి నుంచి సహాయం ఆశించరు. ఇక్కడి కార్మికులు, రైతులు ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ రైతులు పిల్లల భవిష్యత్ కోసం భూములు త్యాగం చేశారు. మీ పిల్లలు కంపెనీలో కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకొచ్చారు. మేం అనుమతులు ఇవ్వగలం కానీ కంపెనీకి నమ్మకం మీ వలనే వస్తుంది. మీరు ఆ నమ్మకాన్ని ఇచ్చారు అంటూ ప్రశంసించారు మంత్రి నారా లోకేష్..








