ప్రకాశం జిల్లా : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆనం అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. చెరువులోని చేపలను పట్టుకునేందుకు నీటిని వదిలేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల్లో ఇలాంటి చర్యల వలన ఆయా చెరువుల్లో నీరు వృధా కావడంతో పాటు సమీప గ్రామాల్లోని భూగర్భ నీటిమట్టం కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీటి పైప్ లైన్ల కోసం రోడ్లను తవ్వుతున్నారని, అనంతరం వాటిని సక్రమంగా పూడ్చకుండా వదిలేయడం వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన చెందారు. పైపులైన్లు వేసే కాంట్రాక్టర్లే తిరిగి రోడ్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంటుందన్నారు.
సంబంధిత కాంట్రాక్టు లోనే ఈ విషయాలను స్పష్టంగా పొందు పరుస్తున్నందున అధికారులు వాటిని అమలయ్యేలా పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. 2014-19 కాలంలో పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన పనులకు బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సంబంధిత అధికారులు కలెక్టర్ తో చర్చించి బిల్లులను ప్రభుత్వానికి పంపించాలని గొట్టి పాటి రవికుమార్ ఆదేశించారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాలను నివారించేందుకు పెట్రోలింగ్ వాహనాలను సమర్ధంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. మేదరమెట్ల మంచినీటి పథకానికి సంబంధించిన నిర్వాసితులకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినందున అవసరమైన చర్యలను చేపట్టాలని అన్నారు. జాతీయ రహదారుల్లో నీళ్లు నిలిచి పోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు.





