అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ టెక్స్ -2026 కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెల 14 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అతిపెద్ద అంతర్జాతీయ టెక్స్టైల్ ప్రదర్శన భారత్ టెక్స్ -2026 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 17వతేదీ వరకూ నాలుగు రోజుల పాటు సాగే ఈ ఈవెంట్ లో ఏపీ టెక్స్ టైల్స్ ఉత్పత్తుల అమ్మకాలే లక్ష్యంగా మంత్రి సవిత ఢిల్లీలో గురువారం, శుక్రవారం రెండ్రోజులు పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా పలువురు జాతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులతో భేటీ అయ్యి ఏపీ టెక్స్ టైల్స్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా భారత్ టెక్స్ లో మంత్రి సవిత ఒప్పందాలు చేసుకోనున్నారు. ఏపీ నేత కార్మికులకు, టెక్స్టైల్ స్టార్టప్లకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలను సృష్టించడానికి మంత్రి సవిత ఈ ఈవెంట్ ను వినియోగించు కోనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్ లోని ఆధునీకరించిన లేపాక్షి షోరూమ్ ను మంత్రి సవిత ప్రారంభించనున్నారు. అనంతరం ఆమె అమరావతికి తిరుగు పయనమవుతారని మంత్రి కార్యాలయం తెలిపింది.





