
పారదర్శకంగా తిరుమలలో బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయింపు
తిరుమల ఫ తిరుమల శ్రీవారి దర్శనార్ధం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్ వైజర్లు, ట్రైనర్స్తో నిరంతర శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇందుకోసం నూతన సాఫ్ట్వేర్ రూపొందించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్నాయుడు చెప్పారు. అదే విధంగా తిరుమలలో పారదర్శకంగా బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయించినట్లు ఛైర్మన్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్వో మురళీకృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. శ్రీవారి భక్తులకు స్వచ్ఛంధంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవను 2000 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా తిరుమలలో ప్రారంభించారన్నారు. శ్రీవారి సేవ ప్రారంభించి ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి కావస్తోందని, ఈ 25 సంవత్సరాలలో తిరుమల, తిరుపతిలలో దాదాపు 17 లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛంధంగా శ్రీవారి సేవలో పాల్గొన్నట్లు చెప్పారు. శ్రీవారి సేవకులకు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
రోజుకు దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాలలో తమ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం ఈవో శ్యామల రావు మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు భక్తులకు మేరుగైన సౌకర్యాలు కల్పించడం, తిరుమల పవిత్ర కాపాడటంలో భాగంగా గత 14 నెలలుగా టీటీడీలో అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా క్యూ లైన్లు, పారిశుద్ధ్యం, కల్యాణకట్ట, లగేజి కౌంటర్లు, అన్న ప్రసాదాలు, శ్రీవారి సేవకులతో నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ చేస్తున్నామన్నారు. లడ్డూ, అన్న ప్రసాదాల నాణ్యత, రుచిపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నదన్నారు. శ్రీవారి సేవకులట్రైనర్స్కు ఐఐఎం అహ్మదాబాద్, Director, Planning, Govt. of A.P వారి ఆధ్వర్యంలో సేవకులకు సంయుక్తంగా శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందన్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా శ్రీవారి వైభవం, తిరుమల ప్రాముఖ్యత, భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలు, సేవాతత్వం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ విభాగంలో 45 – 65 సంవత్సరాల వయసు ఉన్న శ్రీవారి సేవలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తిరుమలలోని వివిధ విభాగాలలో సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. తద్వారా సేవకులు మరింత క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు ఈవో. వీరి సేవా కాల పరిమితి 15 రోజులు, 30 రోజులు, 90 రోజులు అని, కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నారు. టిటిడిలోని స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద, చిన్న పిల్లల ఆసుపత్రి, అశ్వినీ ఆసుపత్రులలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
విదేశాలలో ఉన్న ఎందరో ఎన్.ఆర్.ఐ నిపుణులు శ్రీవారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారని తెలిపారు. వివిధ వృత్తులలో ప్రావీణ్యం కల్గిన నిపుణులకు శ్రీవారి సేవకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
తిరుమలలో పారదర్శకంగా బిగ్ , జనతా క్యాంటీన్లు కేటాయించినట్లు, ఇందుకోసం నూతన పాలసీ తయారు చేసి, నిపుణుల కమిటీతో ఆయా సంస్థల కార్యకలాపాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన సంస్థలకు మాత్రమే క్యాంటీన్లు కేటాయించినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆహార అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం పది (10) బిగ్ క్యాంటీన్లు మరియు ఆరు (6) జనతా క్యాంటీన్లు ఉన్నాయన్నారు. భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని టీటీడీ దేశంలోని ప్రముఖ ఆహార పదార్థల తయారీ సంస్థలకు EOI ద్వారా పారదర్శకంగా కేటాయించిందన్నారు.
టీటీడీ నూతన విధానాన్ని రూపొందించిందని, అందుకు అనుగుణంగా నిపుణుల కమిటీ ఆహార పదార్థాల నిణ్యాత ప్రమాణాలలు, ఇతర అంశాలను పరిశీలించిందని చెప్పారు. ఇందులో భాగంగా సదరు సంస్థలు లాభాపేక్ష లేకుండా భక్తులకు సేవలందించేందుకు ముందుకు వచ్చాయన్నారు.