
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేతృత్వంలో బీసీ మంత్రులు, హోం మంత్రి సవిత, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి సవిత విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి పాటు పడుతోందన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2025-26 బడ్జెట్ లో రూ.47 వేల కోట్లకుపైగా కేటాయించారన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూప కల్పనకు నిర్ణయించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం మేర బీసీ రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం బీసీ మంత్రులు రెండు పర్యాయాలు సమావేశమయ్యామని, త్వరలో మరో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బీసీలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారన్నారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీలోని బీసీ నాయకులను అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారన్నారు. బీసీలకు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నామన్నారు.