
భక్తుల సౌకర్యాలకు ఇబ్బంది రాకూడదు
తిరుమల : తిరుమల పవిత్రతను కాపాడటం, సాధారణ భక్తులకు ఇబ్బంది లేని దర్శనం కల్పించడం అనేది సీఎం చంద్రబాబు కల అని దానిని తుచ తప్పకుండా ఆచరణలో చేసి చూపించాలని స్పష్టం చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. రాబోయే వార్షిక బ్రహ్మోత్సవాల నుండి ప్రత్యేక దృష్టి సారించి దానిని సాధించాలని స్పష్టం చేశారు. టీటీడీకి చెందిన వివిధ విభాగాల అధిపతులు, జిల్లా పరిపాలన, పోలీసులు, టీటీడీ అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరితో వివరణాత్మక, తుది సమీక్షా సమావేశం పూర్తి చేశారు. అనంతరం శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈఓ మీడియా సమావేశం నిర్వహించారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలను సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగంతో విస్తృతంగా చర్చించామన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ సాంప్రదాయ ప్రకారం శుభ్ర పరచడం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆభరణాలను శుభ్ర పరచడం, వాహనముల ట్రయల్-రన్ పూర్తయిందన్నారు ఈవో. సెప్టెంబర్ 24న ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. 25న పిఎసి 5ని ప్రారంభిస్తారని తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం రూ.9.5 కోట్లు, విద్యుత్ రంగ పనుల కోసం రూ. 5.50 కోట్లు రిలీజ్ చేశామన్నారు. పుష్ప అలంకరణలు రూ. 3.50 కోట్లతో చేపట్టామన్నారు. అలంకరణ కోసం 60 టన్నుల పువ్వులు ఉపయోగిస్తారన్నారు. తొమ్మిది రోజుల పాటు పారిశుధ్యం కోసం అదనపు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.