ఆధారాలు సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లోని యూసుఫ్ గూడలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు బీఆర్ఎస్ నేతలు. పక్కా ఆధారాలతో రిటర్నింగ్ కు సమర్పించారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వేలల్లో ఉన్న దొంగ ఓట్లను, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ డివిజన్ పరిధిలోని ఒక్కొక్కరి పేరుతో ఉన్న రెండు మూడు ఓట్లు, ఎపిక్ కార్డుల వివరాలు సేకరించి వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో రిటర్నింగ్ అధికారిని కలిశారు స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్.
బైఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించిన విషయాన్ని ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బయట పెట్టారు. ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా దొంగ ఓట్లు బయట పడుతూనే ఉన్నాయి. దీంతో వాటికి సంబంధించిన ఆధారాలను ఎన్నికల అధికారులకు అందజేసి వాటిని వెంటనే తొలగించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగాలంటే అధికారులు వేగంగా స్పందించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని , ఎన్నికల నిబంధనలను కాలరాస్తూ వేల సంఖ్యలో దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే దీనిపై కోర్టులో కేసు కూడా వేసినట్టు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేసే పరిస్థితి లేక పోవడంతో ఇలా దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని అందుకే వేలాదిగా దొంగ ఓట్లు తయారు చేయించిందన్నారు. వెంటనే వాటన్నింటిని జాబితాలోనుండి తొలగించాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.
ఈ కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్, యూసుఫ్ గూడ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి, హరీష్ రెడ్డి, క్రాంతి కుమార్, బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ కిరణ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.






