దరఖాస్తులకు ఆహ్వానం పలికిన సన్ ప్రీత్ సింగ్
వరంగల్ జిల్లా : రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ , షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి, విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుండి పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు, యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో పోలీసుల ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఇటీవల కాలంలో తీసిన (03) ఫోటోలు మరియు తక్కువ నిడివి (03 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈ నెల 25వ తేదీ లోపు జిల్లా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 x 8 సైజ్ ఫోటోలను పోలీస్ పిఆర్వో కు అందజేయాలన్నారు.
ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు ప్రధానంగా మూడనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు , అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన, ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలు, సైబర్ నేరాలు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ , మత్తు పదార్థాల సేవనం వాటి అనర్దాలు, అవగాహన పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2024 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటి వరకు తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ లు మాత్రమే పంపించాల్సి వుంటుందన్నారు.
పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు (Essay Writing Competition) నిర్వహించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలియజేసారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా కమిషనరేట్ స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని సీపీ సూచించారు.
వ్యాసరచన అంశం “Drugs Menace: Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs” (డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర , విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు) అనే దానిపై ఉండాలని తెలిపారు సీపీ. ఇందుకు సంబంధించి లింకు పై క్లిక్ చేయాలని https://forms.gle/jaWLdt2yhNrMpe3eA పేర్కొన్నారు. పాల్గొనే విద్యార్థులు పేరు, విద్యార్హత, స్కూల్ వివరాలు ఇవ్వాలని కోరారు. వ్యాసాన్ని పేపర్పై రాసి, దానిని చిత్రం (image) లేదా PDF ఫార్మాట్లో (500 పదాలు మించకూడదు) అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 8712685050 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు.






