కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : జోర్డాన్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 12 మంది వలస కార్మికులకు ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి వల్ల విముక్తి లభించింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీశ్ రావు కేంద్రంతో మాట్లాడారు. వారంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. అనంతరం నేరుగా హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మీరు చేసిన ప్రయత్నం వల్లనే తాము బయట పడ్డామన్నారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తిరిగి తీసుకు వచ్చేందుకు కృషి చేశామన్నారు. బతుకు దెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం జోర్డాన్, ఇజ్రాయిల్, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని ఎంతో మంది బతుకులు ఆగం అవుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు.
12 మంది వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించి వారికి సాయం అందించాలని కోరామన్నారు. మరోవైపు జోర్డాన్లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు వెళ్లి కార్మికులు అనేకసార్లు మొర పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించు కోలేదని ఆరోపించారు హరీశ్ రావు. అందుకే జోర్డాన్లో చిక్కుకున్న12 మంది కోసం పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకు రావడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో మంది ఉపాధి నిమిత్తం వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూన్నారని, మన పిల్లల్ని మనం కాపాడు కోవడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతే బీఆర్ఎస్ పార్టీ 12 మందినీ కాపాడి స్వదేశానికి తీసుకు రావడం జరిగిందన్నారు.






