బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

VijayaBhaskar · November 12, 2025
Spread the love

ప్ర‌క‌టించిన టీటీడీ జేఈవో వి. వీర‌బ్రహ్మం

తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్స‌వాలు ఈనెల 17 నుంచి 25 వ‌ర‌కు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఈ ఉత్స‌వాల‌లో పాల్గొంటున్నార‌ని వెల్ల‌డించారు. 17వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు జేఈవో. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని అన్ని ఆర్జిత సేవ‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు చెప్పారు.

ఈ సంద‌ర్బంగా వాహ‌న సేవ‌ల వివ‌రాలు వెల్ల‌డించారు వి. వీర‌బ్ర‌హ్మం. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలలో అమ్మ వారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారని తెలిపారు. 17వ తేదీ సోమ‌వారం ధ్వ‌జారోహ‌ణం, చిన్న శేష వాహ‌నం, 18న మంగ‌ళ‌వారం పెద్ద శేష వాహ‌నం, హంస వాహ‌నం, 19న బుధ‌వారం ముత్యపు పందిరి వాహనం, సింహ వాహ‌నం, 20వ తేదీ గురువారం కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, 21వ తేదీ శుక్ర‌వారం
పల్లకీ ఉత్సవం, గజ వాహనం, 22న శ‌నివారం సర్వ భూపాల వాహనం, స్వర్ణ రథం, గరుడ వాహనం, 23న ఆదివారం సూర్యప్ర‌భ వాహ‌నం, చంద్ర‌ప్ర‌భ వాహ‌నం, 24న సోమ‌వారం ర‌థోత్స‌వం, అశ్వ వాహ‌నం, 25న మంగ‌ళ‌వారం పంచ‌మీ తీర్థం,, ధ్వ‌జారోహ‌ణం ఉంటుంద‌ని వెల్ల‌డించారు జేఈవో.