శ్రీ పద్మావతి ఆలయంలో లక్ష కుంకుమార్చన
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 16వ తేదీ అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహ వచనం, రక్షా బంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు. ఆలయంలో నవంబరు 17న ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
18వ తేదీ ఉదయం పెద్ద శేషవాహనం, రాత్రి హంస వాహనం , 19వ తేదీన ఉదయం ముత్యపు పందిరి వాహనం , రాత్రి సింహ వాహనం, 20వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం,
21వ తేదీన ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజ వాహనం, 22న ఉదయం సర్వ భూపాల వాహనం , సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గరుడ వాహనం, 23న ఉదయం సూర్య ప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 24న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం, 25న ఉదయం పంచమీ తీర్థం, రాత్రి ధ్వజావ రోహణం నిర్వహిస్తారు.






