బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం

VijayaBhaskar · November 24, 2025
Spread the love

ప్రేమతో మనుషులను గెలిచాడన్న రేవంత్ రెడ్డి

శ్రీ స‌త్య‌సాయి పుట్టప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచాడ‌ని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్స‌వాల‌లో పాల్గొన‌డం అరుదైన గౌర‌వంగా, అవ‌కాశంగా భావిస్తున్నాన‌ని అన్నారు. మానవీయ విలువ‌లు, నిస్వార్థ సేవ‌తో కోట్లాది మంది ప్ర‌జ‌ల్లో నిలిచి పోయార‌ని ప్ర‌శంసించారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చని బాబా నిరూపించారని అన్నారు.

ఆయన మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రేమ‌త‌త్వం మీ అందరిలో కనిపిస్తోంద‌ని చెప్పారు. స‌త్య‌సాయి బాబా ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ నుంచి పీజీ వరకూ పేదలకు ఉచితంగా విద్యను అందించార‌ని, వారంతా ఇప్పుడు ఉన్న‌త ప‌ద‌వుల‌లో ఉన్నార‌ని పేర్కొన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించి దేవుడిగా కొలువబడుతున్నార‌ని తెలిపారు సీఎం. గతంలో పాలమూరు జిల్లాలో బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి చేసి వారి దాహార్తిని తీర్చారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తమిళనాడు, కర్ణాటకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు.