కార్య‌క‌ర్త‌లే టీడీపీకి కీల‌కం : నారా లోకేష్

VijayaBhaskar · December 2, 2025
Spread the love

బ‌లోపేతం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపు

గుంటూరు జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. మనం సైకోతో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకుని, అందరం ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.

మొదటి రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు ఎన్.అమర్ నాథ్ రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావు, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, మండల పార్టీ అధ్యక్షుల విధులు, బాధ్యతలపై మార్గదర్శనం చేశారు.