హాజరు కావాలంటూ నోటీసులు జారీ
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం దీనిపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు ప్రముఖులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిలో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తారక రామారావు, తన్నీరు హరీశ్ రావుతో పాటు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులను విచారించింది సిట్. మరో వైపు ఎవరూ ఊహించని రీతిలో మాజీ మంత్రులు, బావా బామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ లను 7 గంటలకు పైగా విచారించింది. తాజాగా ఇదే కోటరీ, కుటుంబానికి సంబంధించి మాజీ పార్లమెంట్ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కూడా సిట్ షాక్ ఇచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తమ ముందు హాజరు కావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో మనోడు దారికి వచ్చాడు. తాను సిట్ జారీ చేసిన నోటీసులను అందుకున్నానని, తప్పకుండా సిట్ ముందు హాజరవుతానని తెలిపాడు. తనకు చట్టం పట్ల గౌరవం ఉందని, వారు ఏది అడిగినా వివరాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని పేర్కొన్నాడు జోగినపల్లి సంతోష్ కుమార్. ప్రస్తుతం తను బీఆర్ఎస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సిట్ అధికారులు 160 సీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొంది.






