మాయ మాటలు చెప్పి విద్యార్థినితో రహస్యంగా పెళ్లి
హైదరాబాద్ : రోజు రోజుకు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే పేరెంట్స్ జడుసుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ ఏదో ఒక సమాచారం బయటకు వస్తూనే ఉంది. పలు చోట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విద్యార్థినుల పట్ల వివక్ష కొనసాగుతోంది. తాజాగా పాఠాలు చెప్పాల్సిన టీచర్ ప్రేమ పాఠాలు వల్లించి విద్యార్థిని మెడలో పసుపు తాడు కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన మల్కాజిగిరి కమిషనరేట్ లో చోటు ఏసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు 20 రోజుల కిందట సదరు టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆపై రిమాండ్ కు తరలించారు.
ఈ ఘటన అన్నోజిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో చోటు చేసుకుంది. ఇక్కడ పర్రే మైటీన్ అనే వ్యక్తి టీచర్ గా పని చేస్తున్నాడు. ఇదే స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయ మాటలు చెప్పాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆపై రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇంట్లోకి వెళ్లిన విద్యార్థిని మెడలో పసుపు తాడు ఉండడం చూసి అవాక్కయ్యారు తల్లిదండ్రులు. టీచర్ పర్రే మైటీన్ తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పడంతో పేరెంట్స్ పాఠశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించారు. తనకు ఏమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు . టీచర్ ను నిలదీయడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ప్రిన్సిపాల్ సదరు టీచర్ ను పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు పర్రే మైటీన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.






