రాష్ట్రంలో ప్రతీ రంగంలోనూ వృద్ది నమోదు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతీ రంగంలోనూ వృద్ధి నమోదైందని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు పురోగతి సాధిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అతి తక్కువ కాలంలో ప్రజలు మెచ్చే పాలన అందించామని చెప్పారు. ప్రజావసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వివరించారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి ఈ విజయాలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ఓనర్షిప్ తీసుకోవాలని అన్నారు.
ఎన్డీఏ-ఎల్పీ సమావేశంలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది నాటి వైసీపీ ప్రభుత్వ బాధితులేనని సభ్యుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. నేడు నీతులు చెబుతున్న వైసీపీ నేతలు… నాడు అధికారంలో చేసిన అరాచకాలను మరిచి పోయారని విమర్శించారు. వాళ్ల హయాంలో పవన్ కల్యాణ్ విశాఖ వెళితే కనీసం కారు కూడా దిగనివ్వలేదన్నారు. హోటల్ గది నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డారని సీఎం చెప్పారు. తన అరెస్టు సమయంలో మద్దతుగా పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తుంటే… ఆయనకు అనేక అడ్డంకులు సృష్టించారని చంద్రబాబు నాయుడు అన్నారు. విమానంలో వచ్చే అవకాశం లేకుండా చేశారని, రోడ్డు మార్గాన కూడా రానివ్వలేదన్నారు. ఇలా అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదిరించి కూటమి ఐక్యంగా నిలబడి ఎన్నికల్లో గెలిచిందని సీఎం వివరించారు.






