నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి
అమరావతి : కేంద్ర సర్కార్ నిర్వాకం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి . రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథక పరిరక్షణ యాత్ర మార్కాపురం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్బంగా తుమ్మలచెరువు గ్రామంలో జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్రకు స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. 20 ఏళ్ల క్రితం మహానేత YSR ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమైన కరువు పనితో గ్రామాలు బాగుపడ్డాయని, 100 రోజుల పాటు ఉపాధి హక్కుగా మారిందని, కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరిందని గ్రామస్థులు గొప్పగా చెప్పారని అన్నారు షర్మిలా రెడ్డి.
కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన నాటినుంచే ఉపాధి హామీ పథకానికి గ్రహణం పట్టిందని ఆరోపించారు. సగటున 50 రోజులు కూడా పని ఇవ్వడం లేదని మండిపడ్డారు. చేసిన పనికి సైతం వేతనాలు ఎప్పడు ఇస్తారో తెలియని అయోమయం నెలకొందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మన్రేగా పథకానికి, ప్రధాని మోడీ తెచ్చిన VB G – RAM G ( వీబీ గ్రామ్ జి ) చట్టానికున్న వ్యత్యాసాలను తుమ్మల చెరువు గ్రామ ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. 100 రోజుల పని చట్టాన్నే పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెచ్చిన అక్రమ చట్టం వీబీ గ్రామ్ జి ని రద్దు చేసేవరకు కాంగ్రెస్ చేస్తున్న పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.






