భక్తులకు దర్శనం ఇచ్చిన దేవ దేవుడు
తిరుపతి : శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి 7 గంటలకు రాజమన్నార్ దండం ధరించి చక్రవర్తి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గజ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.
వాహన సేవ ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజ వాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజ రాజులు పాలు పంచుకుంటాయి. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, కంకణబట్టార్ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధన శేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






