రామలింగేశ్వర ఆలయంలో కోమటిరెడ్డి పూజలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆ పరమ శివుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించానని చెప్పారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా. ఆయనకు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు, పూజారులు. ఈ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రోడ్డు నెట్వర్క్ను వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. వేములవాడ, శ్రీశైలం వంటి ప్రధాన క్షేత్రాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పరమ శివుని కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించానని అన్నారు. .మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వందల ఏళ్ల చరిత్రను సాక్షిగా నిలబెట్టుకున్న ఈ ప్రాచీన దేవాలయాలు తెలంగాణ సంస్కృతి, శిల్పకళ వైభవానికి ప్రతీకలుగా నిలిచాయన్నారు. 11–12వ శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాల్లో అద్భుతమైన శిల్ప సంపద ఉట్టిపడుతుందని అన్నారు. ముఖ్యంగా ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎల్లప్పుడూ ఒకే విధంగా కనిపించే నీడ విశేష ఆకర్షణ అని పేర్కొన్నారు. ఈ ఆలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ప్రకటించారు. యునెస్కో గుర్తింపు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.





