కీళపట్టు ఆలయంలో అద్భుత శిల్ప ప్రదర్శన
చిత్తూరు జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీళపట్టు గ్రామంలోని త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా విన్నూత్న శిల్ప అమరికలు చేపట్టారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకతతో భక్తులను ఆకట్టుకుంటున్న ఈ ఆలయం, ఈసారి ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠతో మరింత వైభవంగా మారింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగాలను అచ్చుపోసినట్లుగా రూపొందించారు.
ఆయా ప్రాంతాల ఆలయాలను ప్రతిబింబించే విధంగా చేసిన ఈ శిల్ప నిర్మాణాలు చూపరులను అబ్బుర పరుస్తున్నాయి. స్థానిక భక్తుడు గణేశ్ ఆధ్వర్యంలో యువకులు రెండు నెలలపాటు కష్టపడి ఈ అమరికలను సిద్ధం చేశారు. ప్రత్యేకత సంతరించుకున్న ఈ శిలారూపాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి వేడుకలలో ప్రధాన అతిథిగా మాజీ మంత్రి ఆర్కే రోజా ముందుగా విచ్చేసి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల శిల్పాలను పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. భక్తులతో మమేకమై శివనామ స్మరణలో పాల్గొన్నారు.






