స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి
అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికవృద్ధి కలిగించడమే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చేనేత వస్త్రాల అమ్మకం, వినియోగం పెంచేలా చేనేత ఎగ్జిబిషన్లు, బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ చిన్న వేడుకగాని, పండుగాని వచ్చినా ప్రత్యేక డిస్కౌంట్లతో చేనేత దుస్తుల అమ్మకాలు చేస్తున్నామన్నామని తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం అసంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాళ్లను పరిశీలించారు. ఇందులో భాగంగా ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో 12 చేనేత స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇవాల్టి నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకూ ఈ స్టాళ్లు నిర్వహిస్తామన్నారు. చేనేత దుస్తుల వినియోగం పెంచడమే లక్ష్యంగా ఈ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో వస్తుంటారన్నారు. వారంతా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా, నేతన్నలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. ప్రజలంతా వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించడం ద్వారా సంప్రదాయమైన చేనేత వృత్తికి వెన్నుదన్నుగా నిలిచే వారవుతారని మంత్రి సవిత స్పష్టం చేశారు.






