కీలక సమీక్ష చేపట్టిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించిన లేవనెత్తాల్సిన అంశాలు వంటి వాటిని విస్తృతంగా కేటీఆర్ చర్చించారు. పార్టీ పరంగా అటు ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటానికి సంబంధించిన అంశంలో కేటీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా సమన్వయం, ఫాలోఅప్ బాధ్యతలను నాయకులకు కేటీఆర్ అప్పగించారు.
హైదరాబాద్ నగర పాలక సంస్థ ( జీహెచ్ఎంసీ)కి ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించారు. మల్కాజిగిరి కార్పొరేషన్కు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుకు బాధ్యతలు అప్పగించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.





