బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా
అమరావతి : కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించి పోయారు. విస్ఫోటన ఘటనకుగల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు, వైద్య సిబ్బందిని అడిగి మృతులు, క్షతగాత్రుల వివరాలు ఆరా తీశారు పవన్ కళ్యాణ్ .ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనలో పలువురు మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మరో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు వంగలపూడి అనిత, పురపాలక శాఖ మంత్రి నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సైతం బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బందిని ఆదేశించారు పవన్ కళ్యాణ్.





