నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏం ముఖం పెట్టుకుని తెలంగాణలో అడుగు పెట్టారంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం అయ్యిందని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల జాబ్స్ ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యిందని, మరోసారి గుర్తు చేస్తున్నానని అన్నారు కల్వకుంట్ల కవిత. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .
మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదేనా మీ ప్రజా పాలన అంటూ ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్ బోగస్ గా మారింది.. జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం.. వంచన అనే మాటను నిలబెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు కల్వకుంట్ల కవిత. రాహుల్ జీ ఇది పోరాటాల పురిటిగడ్డ అని, ఇచ్చిన హామీని నెరవేర్చక పోతే మిమ్మల్ని వెంటపడి తరమడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.





