రైసినా డైలాగ్ స‌ద‌స్సుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు

VijayaBhaskar · March 7, 2026
Spread the love

ఢిల్లీలో జ‌రిగే రైసినా డైలాగ్ 2026 స‌ద‌స్సు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఆయ‌న ఇవాళ జరిగే ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజ‌రు కానున్నారు. ఈ సంద‌ర్బంగా కూట‌మి స‌ర్కార్ ఏపీలో కొలువు తీరాక తీసుకున్న చ‌ర్య‌లు, నిర్ణ‌యాల గురించి ప్రత్యేకంగా ప్ర‌స్తావించ‌నున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైసినా డైలాగ్ సదస్సు నిర్వ‌హిస్తున్నారు. ఇవాళ ఉదయం 10.50 గంటలకు ఢిల్లీలో కాలు మోపారు సీఎం. మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరవుతున్నారు.

ఇదిలా ఉండ‌గా రైసినా డైలాగ్ సదస్సుకు హాజరు కానున్నారు ఫిన్లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు . ‘జియో పాలిటిక్స్- జియో ఎకనామిక్స్’ అంశం ఆధారంగా ఈ సదస్సులో చ‌ర్చ‌లు కొన‌సాగ‌నున్నాయి. సాంకేతికత- సుపరిపాలన-భవిష్యత్ అనే అంశాలపై కీలక ఉపన్యాసం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు, డిజిటల్‌గా పౌర సేవలు అంశాలను వివరించ‌నున్నారు. అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ డెస్టినేషన్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు అనుసరిస్తున్న నిర్ణయాలను తెలియ చేస్తారు.