నాణ్యత పాటించక పోతే చర్యలు తప్పవు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండ కూడదని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఆరా తీశారు. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ ఇప్పుడూ విశేష ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఝంఝావతి రబ్బర్ డ్యాం కొట్టుకు పోయిందంటూ గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ దెబ్బతినేలా చేశారని ఆరోపించారు జగన్ రెడ్డిపై. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ కు రిపేర్లు చేసినా సరిపోతుందని నిపుణులు నివేదికలు ఇచ్చిన విషయాన్ని తెలిపారు. అయితే నాణ్యత విషయంలో, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం అని సీఎం స్పష్టం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష లో పాల్గొన్నారు.





