ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. కార్పొరేట్ శక్తులకు, వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్రను చేపట్టింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా షర్మిలకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఆమె అటు కేంద్ర సర్కార్ ను ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తాను చేపట్టిన పరిరక్షణ యాత్ర ఏలూరు జిల్లాలోకి చేరుకుంది.
చింతలపూడి నియోజక వర్గంకు చెందిన ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఎర్రంపల్లి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ వేదికగా మన్రేగా పథకం లబ్ధిని, ప్రధాని మోడీ తెచ్చిన కొత్త అక్రమ చట్టం VB G- RAM G ద్వారా జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు షర్మిలా రెడ్డి. ఉపాధి హామీ పథకం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను స్థానికులు ఎండగట్టారు. అర్హులకు కొత్తగా పెన్షన్లు ఇవ్వడం లేదని, మహాశక్తి పథకం కింద నెలకు 15 వందలు ఎప్పుడిస్తారని మహిళలు చంద్రబాబుని సూటిగా ప్రశ్నించారు.





