కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ అంటూ ఫైర్
హైదరాబాద్ : వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేత మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష చేపట్టారు. భూదాన్ భూమి ఎట్టి పరిస్థితుల్లో పేదలకే అప్పగించాలని ఈ సంఘటనను తాము సీరియస్ గా తీసుకున్నాం అన్నారు. ఖమ్మం పెద్ద ఎత్తున ధర్నా చేశాం అన్నారు. ఆ తర్వాత అప్పటికప్పుడు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పోలీసులు విశారదన్ మహారాజ్ ని, నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఎక్కడ మమ్మల్ని వదిలేశారో అక్కడే మేము దీక్ష కొనసాగించాం అన్నారు.
మీడియా, అధికారులు మా పక్షానే ఉన్నారన్న ధీమాతో ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చేసిందని ఆరోపించారు. అందుకే దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భూమి ఆక్రమించుకున్నారని మొన్నటి వరకు చెప్పిన మంత్రులు…ఇవ్వాళ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అర్హులు ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కవిత. పోలీసు కమిషనరే స్వయంగా ల్యాండ్ ఓనర్లను వెకేట్ చేయించామని ట్వీట్ చేశారు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి పేదల ఇళ్లు కూలగొట్టేందుకు ఈ ప్రభుత్వానికి ఎంత ధైర్యం అని ప్రశ్నించారు కవిత. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొనే తిరిగే రాహుల్ గాంధీ దీనికి బాధ్యత వహించాలన్నారు.





