స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా : ఖమ్మంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితులకు తీపి కబురు చెప్పారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో 311 మంది భూ నిర్వాసితులకు పట్టాలు ఇవ్వడంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 24న భూధాన్ భూములను సీసీఎల్, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. పేదల కష్టం తెలిసిన ప్రజా ప్రభుత్వం అర్హులను గుర్తించి వారికి న్యాయం చేయాలని సంకల్పించిందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , సహచర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే సహకారం, అధికారుల ప్రత్యేక చొరవతో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేపట్టి నిజమైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశాం అన్నారు. పేదలకు స్థలంతో పాటు ఇండ్ల మంజూరు, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఇంటి స్థలం ఉన్న మరో 101 మందికి ఇందిరమ్మ ఇండ్లు పట్టాలు అంద జేయడం జరిగిందన్నారు.
గత పది ఏళ్లుగా అధికారంలో ఉండి, 2017 నుండి వెలుగుమట్లలో కనీస సౌకర్యాలు లేక నరకయాతన పడుతున్న పేదలను పట్టించుకోని విపక్ష నేతలు ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. వారి “రెడ్ బుక్” రాజకీయాలకు ప్రజలు ఎప్పుడో చరమగీతం పాడారన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తాం అనే ప్రధాన ప్రతిపక్ష నాయకులు పగటి కలలు మానుకోవాలని అన్నారు.






