పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
తిరుపతి : ప్రముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 27 నుంచి బ్రహ్మోత్సవలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. నూతనంగా అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 1న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిపారు. ఎప్పటి లాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు . జిల్లా అధికారులు, టిటిడి సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు బీఆర్ నాయుడు.
శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రపంచ వ్యాప్తంగా వీక్షించడానికి ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తామని అన్నారు. రూ. 4 కోట్ల రూపాయలతో విద్యుత్ దీపాలంకరణ ఎల్ఈడి , పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ. 20. 17 కోట్లతో 108 అడుగుల జాంబవంతుడు విగ్రహం నిర్మించేలా చర్యలు చేపడుతున్నాం అని తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో భాగంలో 37 కోట్లతో 100 గదులు నిర్మిస్తున్నామని వెల్లడించారు టీటీడీ చైర్మన్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈరోజు నుంచి ఒంటిమిట్టలో భక్తులకు మూడు పూటలా అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు.








