పుష్ప పల్లకిలో భక్తులను కటాక్షించనున్న అమ్మ వారు
తిరుపతి : సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) జేఈవో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఉగాది వేడుకలకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మ వారిని దర్శించు కునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. ఈ సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనం, కుంకుమ అర్చన, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసినట్లు వెల్లడించారు జేఈవో వి. వీరబ్రహ్మం.






