సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన
అమరావతి : పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియ చేశారు. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు సీఎం . ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. పులుపు, తీపి, వగరు, చేదు, కారం లాంటి రుచులు ఉంటాయి. జీవితంలో కష్టసుఖాలు, ఆనంద దుఃఖాల లాగే ఈ రుచులన్నీ కలగలిసి ఉంటాయన్నారు . ఈ ఏడాది అంతా మంచే జరగాలని అందరం కోరుకుంటున్నాం అన్నారు. తెలుగు వారి సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉగాదిని అధికారికంగా నిర్వహించు కుంటున్నాం అని పేర్కొన్నారు.
ప్రతీ ఒక్కరం వేడుకగా ఉగాది నిర్వహించుకుని పంచాంగ శ్రవణం చేస్తాం అన్నారు సీఎం . ఈ ఏడాది 38 మందికి కళారత్న అవార్డులు, 122 మంది ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. వారందరికీ శుభాకాంక్షలు . తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నం, ప్రకృతిని ఆరాధన, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇవి ప్రతీకలు అని పేర్కొన్నారు సీఎం. సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత, ప్రాముఖ్యాలు ఉన్నాయని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు ప్రతిబింబిస్తాయి. నేలను, ప్రకృతిని, నీటిని పూజిస్తాం అన్నారు. మూడో సారి గోదావరి పుష్కరాలను నిర్వహించే గౌరవం నాకు దక్కిందని చెప్పారు నారా చంద్రాబు నాయుడు. నీటిని పరిరక్షించేలా నీటి భద్రత అనే విధానాన్ని తీసుకు వచ్చామన్నారు. తాగడానికి, సాగుకు, పరిశ్రమలకు, పర్యావరణం కోసం నీరు కావాలి అని పేర్కొన్నారు.




