ఉగాది పర్వ దినాన సీం చంద్రబాబు ప్రకటన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఇల్లు లేదని బాధ పడకూడదని, ఆ దిశగా ఇళ్లు త్వరితగతిన నిర్మించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు వెళ్లేలా అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారని చెప్పారు. త్వరలోనే లబ్దిదారులు తమ ఇళ్లలోకి గృహ ప్రవేశం చేయించేలా చేస్తామన్నారు సీఎం.
గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి, ఫ్లాట్ కేటాయింపులు జరగని వారికి వాళ్ల దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లించాలని గౌరవ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కి ఇవ్వాలని చెప్పారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్దిదారులకు అందించి, గృహ ప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పట్టణాభివృద్ధి శాఖపై క్యాంప్ కార్యాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పీ నారాయణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




