ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ తీరుపై భగ్గుమన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని అన్నారు. ప్రతీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ ఎక్సెస్లో ఇస్తున్నారని పేర్కొన్నారు. 9 స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులు KLSR కంపెనీకి ఇచ్చారని ధ్వజమెత్తారు. అత్యధికంగా కొండా సురేఖ నియోజకవర్గంలో 4 99, దామోదర రాజనర్సింహ నియోజకవర్గంలో 4.99 శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెట్టారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు నియజకవర్గాలలో 4.95% ఎక్సెస్లో టెండర్ కట్టబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో 4.77, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో 4 87, స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గంలో 4.89, శ్రీధర్ బాబు నియోజకవర్గంలో 4.89 శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వలేదు కానీ, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన వారికి ఇచ్చి వివక్ష చూపించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో అన్ని పథకాలు అన్ని నియోజకవర్గాల్లో సమానంగా అమలు చేశామన్నారు.





