శాసన సభలో కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు శాసన సభ సాక్షిగా. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత , జనసమూహ నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. జూన్ 26 నుండి జూలై 7 వరకు అత్యంత పవిత్రమైన గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ నిధులను ప్రతిపాదించడం జరిగిందన్నారు భట్టి విక్రమార్క.
ఈ పవిత్ర కాలంలో సుమారు ఎనిమిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, కుంభమేళా తరహాలో, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా పుష్కరాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే రహదారుల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి వంటి సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనను పర్యవేక్షించేందుకు, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు భట్టి విక్రమార్క. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత , జనసమూహ నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.





