కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు తీపి కబురు చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనను కలిసిన మీడియా మిత్రులతో ముచ్చటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. తాను ఉన్నంత వరకు మీకు ఢోకా లేదన్నారు. తాను మాట ఇవ్వనని, ఇస్తే తప్పనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన మాట ప్రకారం జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారు సీఎం.
సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, దీని కారణంగా ప్రభుత్వం ఇవ్వాలని అనుకున్నా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. లీగల్ చిక్కులు లేకుండా మీకు, ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా చూస్తున్నామని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులు అందరికీ స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ముందుకు వచ్చి ఇస్తానంటుంటే మీలోనే సఖ్యత లేదన్నారు. తలోమాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాను మీతో కలిసి కొంతసేపు మాట్లాడుదాం అని అనుకున్నప్పుడల్లా మీరే ఇంటి స్థలాలు గురించి అడగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.






